వారు….అక్షర ప్రేమికులు
నిరంతరం పదవేదంతో భాషించేవారు..
తెలుగు భాషాకీర్తికి
పునాది రాళ్ళు వేస్తారు..
వర్గాలు..వర్ణాలు తెలియని
శాంతి కాముకులు..
వారి కళ్ళలో విజ్ఞానకాంతి వెలుగులు ప్రసరిస్తాయి..
వారి మదిలో..అనుక్షణం
అక్షరసుమాలు..విరబూస్తాయి
జననమే తప్ప ..మరణమెరుగని
అఖండమైన..రచనలతో..
చరిత్ర సృష్టిస్తారు..
అక్షరార్చనలో..కళాతపస్వులు
దేశ చరిత్ర కు
మూలస్థంబం వంటి వారు..
ఈ అద్బుతమైన సృష్టి లో
అణువణువునూ శోధించి..
మేధోమధనంతో రచనాకృతి చేసి
ప్రజల మనో సామ్రాజ్యం లో
చిరస్థాయిగా నిలిచిపోతారు
తెలుగు భాషా ఉన్నతికి కారణభూతులు..
వారంతా…
వాల్మీకులూ..వ్యాసభగవానులే..
వారి ఆశయసాధనలో
అక్షరాలు ప్రజ్వలిస్తాయి ..
అక్షరశరాలను అరాచకాలపై సంధిస్తే
విప్లవాగ్నిని కురిపిస్తాయి ..
సప్తసంద్రాలను దాటి…
తెలుగు జాతి గౌరవాన్ని
దశదిశలా చాటుతాయి..
రేపటితరాలకి..తెలుగుపలుకు కోసం
నేటితరానికి…జ్ఞాన సూక్తులు
బోధించే…గురుబ్రహ్మలు ..
భావప్రకటనలే కానీ
భాషాబేధం లేని ..మహాత్ములు
చైతన్య కిరణాలై..చరిత్ర పుటలో
శాశ్వతంగా నిలిచిపోతారు..
తెలుగు భాష కోసం కృషి చేసిన
ఎందరో మహానుభావులైన
సాహితీ వేత్తలకు..
అక్షర ప్రణామాలు…
ములుగు లక్ష్మీ మైథిలి, నెల్లూరు, ఫోన్:9440088482