ప్రజావాణిలో సత్యం న్యూస్ జర్నలిస్ట్ సురేష్ ఫిర్యాదు
ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసే ఓ జర్నలిస్తును మూడేళ్ళుగా ఓ సమస్య వెంటాడుతోంది. ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అందరిలాగే అతను కూడా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన వడ్ల సురేష్ రెడ్డిపేట గ్రామంలో ఉంటున్న తన తల్లి వడ్ల లక్ష్మీ పేరున ఉన్న భూమి ఎవరో తెలియని వ్యక్తి పేరున ఉందని దానిని తన తల్లి పేరిట మార్చాలని మూడేళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
గ్రామంలో సర్వే నంబర్ 175/అ A లో 0.0725 గుంటల భూమి వడ్ల లక్ష్మీ పేరున ఉంది. దానికి ధరణి కొత్త పాస్ పుస్తకం కూడా వచ్చింది. అయితే ఈ పాస్ పుస్తకంలో 0.725 గుంటలకు బదులుగా 0.775 వచ్చింది. మూడేళ్ళ క్రితం అరగుంట భూమి తీసివేయాలని పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని సరిచేశారు. అప్పటినుంచి ఆ భూమి ఇతరుల పేరున కనిపిస్తుంది. దాంతో సమస్య పరిష్కరించాలని కోరుతూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో నేడు ప్రజావాణిలో దరఖాస్తు చేసాడు.
మీసేవలో సక్సీషన్ కింద దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దాంతో సురేష్ మాట్లాడుతూ.. మీసేవలో సక్సీషన్ కింద దరఖాస్తు చేయాలంటే వెయ్యి రూపాయలు చెల్లించాలని, కానీ ఇప్పటివరకు ఈ దరఖాస్తులు చాలా వరకు రిజెక్ట్ చేసారని, ఇది కూడా రిజెక్ట్ చేస్తారా.. పని చేస్తారా తెలియదన్నారు. ఒక జర్నలిస్టుగా సమస్యలు చెప్తూ వచ్చిన వారి సమస్యలు పరిష్కారం దిశగా వార్తలు రాసినా ఈరోజు తన సమస్య వార్తగా రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇకనైనా అధికారులు స్పందించి తన తల్లి పేరున ధరణిలో మార్పిడి చేయాలని కోరాడు.