విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని, అప్పుడే మొదటి విడత నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘‘నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదు. పిల్లల కోసం నాడు-నేడుతో మంచి కార్యక్రమం చేపట్టాం. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. నాడు-నేడు పనులపై చిన్న వివాదం కూడా రాకూడదు’’ అని అధికారులను ఆదేశించారు.
పాఠశాలలు పునఃప్రారంభించిననాడే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడమే కాక నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆగస్టు 16న పండుగలా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం.
తొలి విడత నాడు-నేడు కింద 15వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దాం. రెండో దశ కింద 16వేల స్కూళ్ల పనులను.. ఆగస్టు 16న ప్రారంభిస్తాం. విద్యాకానుక కిట్లు కూడా అందించబోతున్నాం’’ అని తెలిపారు.