ఫిబ్రవరి 1వ తేదీ నుండి అన్ని పాఠశాలలను పున: ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కోరారు.
గురువారం తన ఛాంబర్లో పాఠశాలల పునః ప్రారంభం విషయమై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
పాఠశాలల పున: ప్రారంభం దృష్ట్యా ఈ నెల 25 నాటికి అన్ని పాఠశాలల్లో మొదటి విడత శానిటైజేషన్ పూర్తి చేయాలి.
అలాగే ప్రతి పాఠశాలలో మాస్కూల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, అన్ని పాఠశాలలో పూర్తి పరిశుభ్రత ఉండేలా పరిశుభ్రత ప్రణాళికను రూపొందించాలన్నారు.
పాఠశాలల నిర్వహణకు ఐదు కమిటీలను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. శానిటైజేషన్ కమిటీలో ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్ ఉంటారు వీరు అందరూ శానిటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
అదేవిధంగా లార్జిస్టిక్ కమిటీ లో ప్రతి తరగతిలో 25 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా, ఒక్కొక్కరికి ఆరు అడుగుల దూరం పాటించేలా, విశ్రాంతి సమయంలో ఒకేసారి అందరినీ బయటకు వెళ్లకుండా, సమయం రెగ్యులేట్ చేస్తూ పంపించాలి.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కేవలం 9, 10 తరగతులకు మాత్రమే హాస్టళ్లను నిర్వహించాలి, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితులలో ఎక్కువ ఫీజులు డిమాండ్ చేయకూడదు, ఒకవేళ ఎవరైనా డిమాండ్ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాము.
బస్సులలో ఎక్కువమంది లేకుండా భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించేలా ట్రాన్స్పోర్ట్ కమిటీ చూసుకోవాలి. మధ్యాహ్న భోజన పథకం కమిటీకి సంబంధించి ఆ కమిటీ సభ్యులు సంసిద్ధులు కావాలి.
ఆరోగ్య కమిటీ లో భాగంగా అన్ని పాఠశాలలకు ధర్మల్ స్క్రీనర్లు ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి, ఇదివరకే కె జి బి వి, ఇతర ప్రైవేటు పాఠశాలల్లో థర్మల్ స్క్రీనర్లు ఉన్నందున ప్రభుత్వ పాఠశాలలకు వీటిని సరఫరా పై ఆలోచించాలి.
పరీక్షల కమిటీ కి సంబంధించి పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రతి ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెప్పే లా చూడటం, అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఫీరియడ్ ను నిర్వహించాలని ఆమె ఆదేశించారు.
ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్ రావు, మున్సిపల్ కమిషనర్లు ,జిల్లా పంచాయతీ అధికారి సురేష్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్,జిల్లాఇంటర్ విద్యాధికారి, జిల్లా సంక్షేమ అధికారి,ఏ ఎం ఓ చంద్రశేఖర్ హాజరయ్యారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి