ముఖ్యమంత్రి కేసీఆర్ పిట్టల దొర కహానీలు చెప్తున్నారని మాజీ మంత్రి షబ్బిర్ అలీ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నిన్న జరిగిన ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రజలకు సందేశాన్ని ఇస్తారని ఆశించామని, కానీ పిట్టల దొర మాదిరిగా కహానీ చెప్పారన్నారు.
కాంగ్రెస్ పార్టీపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నా మేము ఎన్నడూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాట్లాడలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్ డౌన్ నిబంధనలు పాటించామని తెలిపారు. దేశంలో నేనే గొప్ప అని కేసీఆర్ జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణలో మాత్రమే ధాన్యం కొనుగోలు జరుగుతుందని ఎక్కడ జరగడం లేదని అబద్ధాలు చెవుతున్నారని మండిపడ్డారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర మంత్రితో మాట్లాడటం జరిగిందని, 11 వేల కోట్ల రూపాయల ఋణమాఫీతో పాటు క్వింటాలు ధాన్యం 25 వందల రూపాయలకు కొంటున్నామని మంత్రి చెప్పారని తెలిపారు.
మీ బృందంతో కలిసి ఛత్తీస్ ఘడ్ రావాలని ఛాలెంజ్ చేశారు. నీ చరిత్ర ఎవరికి తెలియదు కేసీఆర్.. యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పాస్ పోర్టు దందా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో హుందాగా మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కరోనా సమయంలో మీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు 64 వేల కోట్లు, నమస్తే ట్రంప్ కార్యక్రమానికి 160 కోట్లు వెచ్చించడానికి డబ్బులు ఉంటాయి గాని, వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు డబ్బులు ఉండవా అని నిలదీశారు. కేంద్రం అవలంబించే విధానం ఇదేనా అని ప్రశ్నించారు.