కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది.
ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షులు గంగాధర్ సీనియర్ నాయకులు కమల్ కిశోర్ మాట్లాడుతూ పార్లమెంట్ లో కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను దేశంలోని పలు రాష్ట్రాలు తిరస్కరించి రైతులకు అనుకూల చట్టాన్ని తీసుకొచ్చినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ రాష్ట్ర పాలసీని ఇప్పటివరకు ప్రకటించకపోవడం దారుణమన్నారు.
ఈ చట్టాలతో మార్కెట్లు మూతపడి ప్రయివేట్ వ్యాపారుల చేతిలో వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతుల భూములు కార్పొరేట్ వ్యాపారస్తుల చేతిలోకి వెళ్లి వ్యవసాయం పూర్తిగా కాంట్రాక్ట్ వ్యవసాయంగా మారే ప్రమాదం ఉంది.
సన్నరకం వరి పంటకు బోనస్ ప్రకటించకుండా ఉండటం రైతులకు బారి నష్టం వాటిల్లుతుందని మద్దతు ధర, బోనస్ కలిపి క్వింటాల్కు మద్దతు ధర 2500 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పత్తి పండించమని చెప్పిన సీఎం కేసీఆర్ నష్ట పరిహారం ఇవ్వడంలో ఇప్పటివరకు హామీ ఇవ్వకపోవడం మోసపు మాటలకు నిదర్శనమని రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను మరచి పోయాయన్నారు.
కేంద్రం తెచ్చిన చట్టాలను నిరసిస్తూ రైతులందరు అధిక సంఖ్యలో సంతకాలను చేపట్టి గవర్నర్, రాష్ట్రపతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, టిపిసిసి ఆధ్వర్యంలో చేరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందన్నారు.
కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ శాసన సభ్యులు సౌదాగర్ గంగారాం,సీనియర్ నాయకులు కమల్ కిషోర్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ ఎంపీటీసీ అవారి సురేష్, చింతల హనుమాన్లు శివరాజ్పాటిల్ యూత్ నాయకులు సాయిని అశోక్, సుజీత్, బాలకృష్ణ,తక్కడపల్లి రవి దేశాయి, పోతుల లింగురా౦,గాండ్ల అశోక్,దర్పల్లి శేఖర్ ,సాయిని విట్టల్, మండల కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.