రైతులకు సంకెళ్లు వేసిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వివిధ కేసులలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 43 మందిని నరసరావుపేట సబ్ జైల్ నుండి గుంటూరు జిల్లా జైలుకు తరలించే క్రమంలో వారి చేతులకు బేడీలు వేశారు. ఆ 43 మంది రిమాండ్ ఖైదీలలో 7 గురు రైతులు.
ధర్నాలకు వస్తున్న వారిని ట్రాక్టర్లు అడ్డుపెట్టి,బెదిరించిన కేసులో ముద్దాయిలు. వీరిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నరసరావుపేట ప్రత్యేక మొబైల్ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ముద్దాయిలను తరలించే క్రమంలో రిమాండ్ ఖైదీలకు సంకెళ్ళు వేశారు.
దీన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. దీనిపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని నేడు వివరణ ఇచ్చారు. రిమాండ్ ఖైదీలకు సంకెళ్ళు వేసిన విషయం తెలిసిన వెంటనే, ఈ ఘటనకు సంబంధించి ఎస్కార్ట్ విధుల్లో ఉన్న 6 మంది హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని, ఆర్ ఎస్సై, ఆర్ఐ లకు ఛార్జ్ మెమోలు జారీ చేశామని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు నిమిత్తం అదనపు ఎస్పీ (ఏఆర్)స్థాయి అధికారిని విచారణా అధికారిగా నియమించి, రిపోర్ట్ కోరామని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్ట కరమని, ఇవి మరల పునరావృతం కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏఆర్ అదనపు ఎస్పీ కి, ఏఅర్ డిఎస్పీకి ఆదేశాలు జారీచేశామని తెలిపారు.