నిరర్ధక ఆస్తుల పేరుతో తిరుమల దేవదేవుడి ఆస్తులు అమ్మాలనే ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేశారు. అన్ని వైపుల నుంచి వచ్చిన వత్తిడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలొగ్గింది. తిరుమల తిరుపతి దేవస్థానం తమ నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పినా చివరకు ప్రభుత్వమే స్వామివారి అమ్మకాల ప్రక్రియను నిలిపివేసింది.
2016 జనవరి 30 న టీటీడీ బోర్డు భూముల అమ్మకానికి చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తీర్మానంలో 50 చోట్ల భూములు అమ్మాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ తీర్మానం తదుపరి చర్యలుగా ప్రస్తుత బోర్డు చర్యలు తీసుకున్నది.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని టీటీడీ బోర్డుకు ప్రభుత్వం సూచన చేసింది. ఆధ్యాత్మిక వేత్తలు, ధర్మ ప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం కోరింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు భూముల వేలం ప్రక్రియ నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
ప్రస్తుత బోర్డు జారీ చేసిన వేలం ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేస్తే సరిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నది అని గుర్తు చేయడానికి 2016 నాటి టీటీడీ బోర్డు తీర్మానాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం శ్రీవారి భక్తులకు పాక్షిక ఉపశమనమని చెప్పవచ్చు.