ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు నిర్దిష్ట గడువులోగా సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చి పరిష్కరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ సంబధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాస్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, డీఆర్వో కె శ్రీధర్ రెడ్డి, కాకినాడ సెజ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె మనోరమ, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ డి పుష్పమణిలతో కలిసి ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో మొత్తం 364 అర్జీలు స్వీకరించారు. ఉపాధి అవకాశాలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్, బీమా తదితరాలపై అర్జీలు అధికంగా వచ్చాయి.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను నాణ్యతతో గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. రీఓపెన్ అయ్యే దరఖాస్తులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.