మే 23వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్ల, డిపార్ట్మెంట్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ డీఈఓ గోవిందరాజులు అన్నారు. శుక్రవారం స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలకు నిర్వహించారు. ఈ సమావేశంలో డిఈఓ మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత పది పరీక్షలు జరుగుతున్నాయని,అవి ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన పూర్తి బాధ్యత ఛీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ పైనే ఉందన్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. అధికారులు, సిబ్బంది కూడా సంయమనంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు.
పరీక్షల విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేయాలని విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పరీక్ష కేంద్రంలో అన్ని అంశాలను కూలంకుశంగా పరిశీలించి ఇన్విజిలెటర్లకు, సిబ్బందికి పలు సూచనలు చేయాలన్నారు.
ఈనెల 24 నుండి పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పదవ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటలకు వరకు ప్రతి రోజూ రెండు గంటల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది అన్నారు. ప్రత్యేక తరగతులకు పాఠశాలలో నిర్వహించే సెక్షన్ల వారీగా కేటాయించి హాజరయ్యేలా చూడాలన్నారు.
పది పరీక్షలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక తరగతుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
గడిచిన రెండేళ్లు కరోనా వల్ల పాఠశాలలు మూతపడడం, పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తం కావడం జరిగిందని, పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న దృష్ట్యా ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా తర్ఫీదు చేయాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాసేలా చూడాలని చెప్పారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పరీక్ష విధుల నుండి ఎవరికీ ఏ విధమైన మినహాయింపులు లేవని ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచిపేరు తీసుకొచ్చేలా పరీక్షలు నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖరరావు , జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజు, సెక్షన్ క్లర్క్ వెంకట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా