సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలో స్వయంగా వెలిసిన శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారికి మంగళవారం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్ర, నమక,చమక,సహిత ఏకాదశ రుద్రాభిషేకం అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ,ధనుంజయ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాలతో వైభవంగా అభిషేకాలు నిర్వహించారు.
శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి భజన భక్త బృందంచే ‘ఓమ్ నమశ్శివాయ’పంచాక్షరీ మంత్ర జపాన్ని ఏకాహంగా నిర్వహించారు.ఉభయ తెలుగు రాష్ర్టాలలోని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు చేయించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయం లోని శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి,నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి సహస్ర నామాలతో కుంకుమార్చన గావించారు.అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.
సత్యం న్యూస్,హుజూర్ నగర్