ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తంగెళ్ల స్టేడియంలో జిల్లా స్థాయి ఉద్యోగులకు, పాత్రికేయులకు, జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ముఖ్యఅతిథిగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు విధులలో నిమగ్నమై మానసిక ప్రశాంతతను కోల్పోయిన సమయంలో ఇలాంటి క్రికెట్ ఆటల పోటీలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆయన అన్నారు. ఉద్యోగులు ఇలాంటి ఆటల పోటీల కార్యక్రమాలలో పాల్గొని వారి ప్రతిభను నిరూపించుకోవాలని తెలిపారు. ఉదయం ప్రారంభించిన క్రికెట్ లీగ్ లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జట్లు, పోలీస్ శాఖ మరియు అటవీశాఖ , మెడికల్ అండ్ హెల్త్ మరియు పంచాయతీరాజ్ శాఖ, కలెక్టరేట్ మరియు రెవెన్యూ శాఖ జట్లు పోటీలలో పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు.
ఈ జట్లలో గెలిచిన వారికి శనివారం సెమీఫైనల్ , ఫైనల్ పోటీలు ఉంటాయని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ టీమ్ లో క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ ఏ ఓ విజయభాస్కర్ డిపిఆర్ఓ రఫిక్ కలెక్టరేట్ సూపర్డెంట్లు రాజ్ ప్రకాష్ , విశ్వ ప్రసాద్ రెవిన్యూ పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీరాజ్ , అటవీశాఖ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులు, ఆయా శాఖల సిబ్బంది ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.