అప్పు…. అప్పు… అప్పు… రాష్ట్రాలన్నీ అప్పుల వేటలో నిమగ్నమై ఉన్నాయి.
అత్యధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల కోసం వెళుతుండగా, సంక్షేమం పేరుతో ఉన్న నిధులను తాయిలాల్లా పంచిపెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పుల వేటలోనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో అయితే 41 వేల కోట్ల రూపాయల మేరకు బిల్లులు లేకుండా దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కూడా అప్పుల వేట ఆగడం లేదు.
దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.1,92,091 కోట్ల రుణ సేకరణకు సిద్ధమయ్యాయి.
3 నెలల్లో రూ.8వేల కోట్లు అప్పు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్…. 6 వేల కోట్లు అప్పు తీసుకోవడానికి తెలంగాణ ప్రయత్నిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన క్యాలెండర్ను రిజర్వు బ్యాంకు విడుదల చేసింది.
ఈ త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం 4 విడతల్లో రూ.6 వేల కోట్ల రుణం సేకరించనుంది. జులై 27న రూ.1,000 కోట్లు, ఆగస్టు 10న రూ.2,000, ఆగస్టు 24న రూ.1,000, సెప్టెంబర్ 7న రూ.2,000 కోట్లు తీసుకోనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 విడతల్లో మొత్తం రూ.8 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం ద్వారా రాష్ట్రాలు ఈ రుణాన్ని సేకరించనున్నాయి.