విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించి, వెనుకబడిన విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖాధికారి యం గోవిందరాజులు పేర్కొన్నారు. ఆయన సోమవారం తాడూర్ మండలంలోని మెడిపూర్ జడ్పీ హైస్కూ తో పాటు ప్రాథమిక పాఠశాలలను, తాడూర్ కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు.
మే 11 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులను ఆ దిశగా సంసిద్ధం చేసి, నూరుశాతం ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమీక్షించి పాఠశాలల్లోని మౌలిక వసతులు, విద్యాబోధన తదితర వాటిపై ఆరా తీసి విద్యార్థుల సామర్ధ్యాన్ని పరీక్షించారు.
మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద మెడిపూర్ ప్రాథమిక పాఠశాల తోపాటు ఉన్నత పాఠశాల మొదటి విడతలో ఎంపిక అయిందని, పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో 12 రకాల వసతులు ప్రభుత్వం సమకూర్చినందన్నారు.
తద్వారా విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులను విద్యనభ్యసించే విధంగా ప్రభుత్వ బడులు మారన్నాయన్నారు.
అదేవిధంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేలా కృషి చేయాలన్నారు. తాడూర్ కేజీబీవీలో
మెనూ ప్రకారం నాణ్యతా ప్రమాణాలతో కూడిన రుచికర భోజనాన్ని అందించాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని ఆయన పరిశీలించారు.
రీడ్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు పరచాలని ఆదేశించారు. ఆయన తోపాటు వెంట జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.