సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండలం రేవూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి గోదా సమేత రంగనాయక స్వామి వార్ల దేవస్థానంలో 11వ, వార్షిక మహోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, రక్షాబంధనం అనంతరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, నూతన పట్టు వస్త్రాలంకరణ గావించారు.
తదుపరి గ్రామం, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో,పాడి పంటలతో ఉండాలని సుదర్శన హోమము వైభవంగా నిర్వహించారు. శ్రీమాన్ బొర్రా వాసుదేవాచార్యులు నేతృత్వంలో ఆగమ శాస్త్ర విధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు తూమాటి లక్ష్మీనరసింహాచార్యులు,వేదాంతం వరప్రసాద్,ఆలయ ధర్మ కర్తలు,శ్రీ కృష్ణ యూత్ సభ్యులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.