ముఖ్యమంత్రిగా డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన సేవలు అమోఘం అని గోవిందరావు పేట సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి అన్నారు.
గోవిందరావుపేట మండల కేంద్రంలో వై.ఎస్ 72వ జయంతి కార్యక్రమాన్ని మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముందుగా ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన సీఎంగా ఉన్న రోజులలో ఆయన రూపొందించిన పథకాలు దేశానికే దిక్సూచీలా మారాయని ఎల్లారెడ్డి తెలిపారు.
ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ పథకం, రైతులకు ఏక కాలంలో పంట రుణమాఫీ, 104, 108 అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ద్వారా పేదలకు ఉన్నత విద్యను అందించడం, అర్హత కలిగిన ప్రతి వారికి ఇందిరమ్మ ఇండ్లు, ఇందిర జల ప్రభ ద్వారా పేదలకు బోర్లు వేయించడం లాంటి అత్యున్నత పథకాలతో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని పెంచాయని అన్నారు.
దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడిగా మన్ననలు పొందాడని కొనియాడారు. ఆయన వ్యూహాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, ప్రణాళిక బద్దంగా చేసిన ప్రతి ఒక్క పథకం విజయవంతం అయి పేదల పాలిట పెన్నిధి అయ్యారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పాలడుగు వెంకటకృష్ణ, జెట్టి సోమయ్య, సర్పంచ్ లావుడియా లక్ష్మి- జోగనాయక్, యూత్ నాయకులు బిజ్జ కృష్ణ స్వామి, సింగపురం కృష్ణ, కోట గణేష్, నాగం రామకృష్ణ, రేగుల అరవింద్, వసీం తదితరులు పాల్గొన్నారు.