తిరుమలలోని నాదనీరాజనం వేదికపై 62 రోజుల పాటు యోగవాశిస్టం – ధన్వంతరి మహామంత్ర పారాయణం అనంతరం గురువారం సుందరకాండ పఠనం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, కరోనా వైరస్ను అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ 2 నెలల పాటు యోగవాశిస్టం పారాయణం చేసినట్టు తెలిపారు.
స్వామివారి ఆశీస్సులతో గురువారం నుండి భక్తులకు దర్శనం ప్రారంభించామన్నారు. ఈ రోజు నుండి సుందరకాండ పఠనం ప్రారంభించినట్టు తెలిపారు. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలో ఐదో విభాగం సుందరకాండ. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ , యుద్ధకాండ మరియు ఉత్తరకాండలుగా రామాయణాన్ని రచించారు.
సుంరాకాండ పఠనంతో సిద్ధించే విజయం
టిటిడి ముద్రించిన శ్రీమద్ రామాయణం గ్రంథంలోని సుందరకాండలో 68 సర్గల్లో 2821 శ్లోకాలున్నాయి. సుందరకాండలోని శ్లోకాలను పఠించడం వల్ల విజయం సిద్ధిస్తుందని, వైరస్ కారణంగా వచ్చే వ్యాధి బాధలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని, ప్రముఖ పండితులు జానమద్ది రామకృష్ణశాస్త్రి, డా. ఆకెళ్ల విభీషణశర్మ ముందుగా సుందరకాండ పారాయణం విశిష్టతను తెలియజేశారు. ఆ తరువాత టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ “రాముడు లోకాభిరాముడు ఉదయించగాను…”, “పెరిగినాడు చూడరో పెద్దహనుమంతుడు…” తదితర సంకీర్తనలు ఆలపించారు.
మొదటిరోజు సుందరకాండలో 6 శ్లోకాలు పఠించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య ఎస్.దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.