దేశంలో కరోనా వ్యాప్తి అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆరుగురు మాజీ ఉన్నతాధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కరోనా వ్యాప్తి అరికట్టడంలో ముందు చూపులేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం వల్లే దేశంలో ఇంత దారుణం జరిగిందని పిటిషనర్లు వాదించారు.
మాజీ ఉన్నతాధికారులు కె పి ఫాబియన్, మీనా గుప్తా, సోమసుందర్ బుర్రా, అమిత్ బదూరీ, మధు బదూరీ పిటీషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ వాదించారు. దేశంలో వలస కూలీలు కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయారని పిటీషనర్లు కోర్టుకు తెలిపారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, వైద్య నిపుణులు హెచ్చరించినా కూడా లక్ష మంది వ్యక్తులు ఒక చోట గుమికూడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు.
ఇలాంటి చర్యల వల్లే దేశంలో కరోనా వ్యాప్తి చెందిందని ఆయన వాదించారు. నిపుణులను సంప్రదించకుండానే లాక్ డౌన్ విధించడం వల్ల దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయారని, జాతీయ స్థూల ఉత్పత్తి పడిపోయిందని ఆయన అన్నారు.
చివరకు వైద్యులు కూడా కరోనా కారణంగా మరణించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ వైఫల్యంపై ఒక స్వతంత్ర న్యాయ విచారణ సంఘంతో దర్యాప్తు చేయించాలని వారు కోరారు.
అయితే ఆరు నెలలు ముందుగా కేంద్ర ఊహించలేదని చెప్పడం కరెక్టు కాదని న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు అన్నారు. పిటిషన్ ను కొట్టేశారు.