ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వీగిపోయాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. దీనిపై జస్టిస్ వినిత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, మెహఫూజ్ నజ్కి వాదనలు వినిపించగా.. ప్రతివాదుల తరఫున ముగ్గురు న్యాయవాదులు తమ వాదనలు ధర్మాసనం ముందు ఉంచారు.
రాజధాని అమరావతిలో వస్తున్నట్లు ముందే తన సన్నిహితులకు చెప్పిన అప్పటి అధికార పార్టీ పెద్దలు తమ వారితో భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేయించిందని ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలపై ప్రాథమిక దశలో ఉన్న విచారణను హైకోర్టు అడ్డుకుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఆ ఉత్తర్వుల్లో కొన్నిఅంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయని, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టానికి అనుగుణంగా దీనిపై విచారణ జరగాల్సి ఉందని ఆయన వాదించారు.
అమరావతిలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం అమలవుతోందని, మొత్తం వ్యవహారంలో అనేక లోపాలు ఉన్నాయని తెలుస్తున్నట్టు ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, 2019లో ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందినట్టు దవే సుప్రీంకోర్టుకు తెలిపారు.
మరోవైపు, ప్రభుత్వ వాదనలతో ప్రతివాద న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని న్యాయవాది ఖుర్షీద్ చెప్పారు. ఒక్కరూ విభేదించనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు.
ఈ కేసులో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం వినియోగంలోకి రాదన్నారు. 2014అక్టోబర్ నుంచి రాజధాని ఎక్కడో మీడియాలో వచ్చిందని, 14 గ్రామాల్లో 30వేల ఎకరాల్లో రాజధాని వస్తుందని కథనాలు వచ్చాయని తెలిపారు. రాజధానిపై 2014 డిసెంబర్ 30న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారన్నారు. న్యాయ, చట్టపరమైన ఫిర్యాదులు నమోదు కాని కేసుగా నిలుస్తుందని ఖుర్షీద్ వాదించారు.
మరో ప్రతివాది తరఫున శ్యామ్దివాన్ వాదనలు వినిపించారు.‘‘రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చింది. ఆరేళ్ల తర్వాత భూములు అమ్మినవారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారు. భూములు అమ్మినవారు ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదని హైకోర్టు ఉత్తర్వుతో తెలుస్తోంది. ఈ కేసులో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం సెక్షన్ -55 వర్తించదు. రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగా జరిగిందే’’ అని వాదించారు.
వాదోపవాదనలు విన్న తర్వాత ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇందుకు సంబంధించిన లిఖితపూర్వక ఆదేశాలు కూడా ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.