సర్పంచులకు సమాంతరంగా పోటీ పెట్టిన గృహసారథులను, కన్వీనర్లను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేట సీపీఎం కార్యాలయం కొరటాల మీటింగ్ హాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేంద్రప్రసాద్ తో బాటు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సర్పంచుల సమస్యలపై ప్రసంగించి, సర్పంచ్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సర్పంచ్ ల సంఘం డిమాండ్లు
1) గ్రామపంచాయతీల సర్పంచుల ఆధీనంలోకి గ్రామ సచివాలయాలను వాలంటీర్లను తీసుకురావాలి. గృహసారుదులను, సచివాలయ కన్వీనర్ల రాజకీయ పార్టీ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రస్తుతం వారు గ్రామపంచాయతీలకు, సర్పంచులకు సమాంతర పోటీ వ్యవస్థగా పనిచేస్తున్నారు. సర్పంచులు, వార్డు నెంబర్లు చేయవలసిన పనులను సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు మాకు సమాంతరంగా పోటీగా చేస్తున్నారు.
ఇది రాజ్యాంగ విరుద్ధం. 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఆర్టికల్ 243 జి, 11 వ షెడ్యూల్లో గ్రామ పంచాయతీలకు ఇచ్చిన 29 అంశాలు శాఖల ప్రకారం గ్రామ సచివాలయాలు, సచివాలయ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు సర్పంచ్ల ఆధీనంలోనే పనిచేయాలి. ఇది సర్పంచుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, గౌరవ మర్యాదలను కాలరాసినట్లే. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచుల కంటే తాత్కాలిక ఉద్యోగులైన వాలంటీర్లకి ఎక్కువ అధికారం ఉండటం, గృహసారథులు, కన్వీనర్ల పేరిట రాజకీయ పార్టీల నాయకులు పెత్తనం చేయడం సిగ్గుచేటు అయిన విషయం. సర్పంచుల అధికారాలను గృహ సారుదులు, కన్వీనర్లు, వాలంటీర్లు హైజాక్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు అని రాజేంద్రప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
2) 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 2020 కోట్ల రూపాయలు ఆర్థిక సంవత్సరము ముగిసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ఎందుకు జమ చేయలేదు? కేంద్ర ప్రభుత్వం అసలు ఆ నిధులను విడుదల చేసిందా లేదా? విడుదల చేస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలోనే దొంగిలించి వేసిందా? విడుదల కాకపోతే అందుకు గల కారణములు ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి.
3) కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జాతీయ బ్యాంకులలో మా సర్పంచ్ ల పేరిట, తెరిచిన పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లోనే వేయాలని, అలాకాకుండా పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ సి.ఎఫ్.ఎం.ఎస్. – పిడి అకౌంట్లలో జమ చేసుకొని ఆ సి.ఎఫ్.ఎం.ఎస్- పిడి అకౌంట్స్ ల నుంచి సర్పంచులకు కూడా చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి నిధులను దొంగిలించివేసి, తన సొంత పథకాలకు, అవసరాలకు వాడేసుకుంటుంది. కనుక జాతీయ బ్యాంక్ పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లోనే కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులు జమ చేయాలి.
4) గ్రామ సచివాలయాల పేరుతో ఎమ్మెల్యేలకు ఇస్తున్న 20 లక్షల రూపాయల నిధులను గ్రామపంచాయతీలోకి ఇచ్చి సర్పంచ్ల ద్వారానే అభివృద్ధి చేయాలి.
5) రాష్ట్రంలోని గ్రామపంచాయతీ ల విద్యుత్ బిల్లులు మరియు క్లాప్ మిత్రుల జీతాలు, సర్పంచులు ఎవరు కట్టవద్దు. పాత పద్ధతిలోనే గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు మరియు క్లాసు మిత్రులు రాష్ట్ర ప్రభుత్వ చెల్లించాలి.
6) జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపాధి హమీ చట్టం ప్రకారం గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలి.
7) అదేవిధంగా సర్పంచులకు, ఎంపీటీసీలకు 15 వేలు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు 30 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలి.
సర్పంచ్ ల న్యాయబద్ధమైన 13 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రంలోని సర్పంచులు అందరూ రాజకీయాలకు అతీతంగా వారి నిధులను, విధులను, అధికారాలను కాపాడుకోవడం కోసం వారందరినీ కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి ,గౌరవ సలహాదారులు ముల్లంగి రామకృష్ణా రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల సుధాకర్, కొత్తపు మునిరెడ్డి, చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ యాదవ్, రాష్ట్ర నాయకులు గోగినేని వసుధ, మానం విజేత, యలవర్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.