నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన నేడు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు చెరుకు సంగీతప్రశాంత్గౌడ్, మహ్మద్ అబ్దుల్ రెహమాన్, ఎం.డి ముస్తఫా అలీ, మహ్మద్ మాజిద్ హుస్సేన్, ఎం.మమత పాల్గొన్నారు.
ఇంకా ఎక్కెల చైతన్యకన్నా, మహ్మద్ అఖీల్ అహ్మద్, షేక్ హమీద్, తొంట అంజయ్య, సబీహా బేగం, సామల హేమ, జీహెచ్ఎంసీ అధికారులు విజిలెన్స్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్లు కెనడి, విజయలక్ష్మి, వి.కృష్ణ, శంకరయ్య, ప్రియాంక అలా, జోనల్ కమిషనర్లు అశోక్ సామ్రాట్, పి.ప్రావిణ్య, బి.శ్రీనివాస్రెడ్డి, ఉపేందర్రెడ్డి, ఎన్.రవికిరణ్ పాల్గొన్నారు.
వీరేకాకుండా వి.మమత, సిసిపి దేవేందర్రెడ్డి, చీఫ్ ఇంజనీర్ హౌసింగ్ సురేష్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మూడు ఎజెండా అంశాలను చర్చించి ఆమోదించారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు: చాంద్రాయణగుట్ట సర్కిల్లో జంగంపేట డివిజన్-45లో రాజన్నబావి నాలా వద్ద మిగిలిపోయిన డ్రెయిన్ బాక్స్ వెడల్పు పనులను రూ. 2కోట్ల 9లక్షలతో చేపట్టాలి.
2020 ఏప్రిల్ 1 నుండి 2021 మార్చి 31 వరకు ఈ.వి.డి.ఎం డైరెక్టరేట్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ అధికారులు, వర్కర్లకు జీతాలు చెల్లించేందుకు, టెండర్లను పది ప్యాకేజిలుగా పిలిచేందుకు ఆమోదం. జిహెచ్ఎంసి అన్నపూర్ణ మీల్స్ ప్రాజెక్ట్ రూ. 5/- భోజన పథకంను నిర్వహించేందుకు హరేరామ హరేకృష్ణ ట్రస్ట్కే ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు.
ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపు మేరకు హైదరాబాద్ ను సంపూర్ణ అక్షరాస్యత నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 24 నుండి మార్చి 4వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి సర్వే చేయించనున్నట్లు తెలిపారు. నగరంలో దాదాపు 24లక్షల 78వేల కుటుంబాలు, 97లక్షల 97వేల జనాభా ఉన్నట్లు తెలిపారు.
నిరక్షరాస్యుల ఎన్యుమరేషన్ ప్రక్రియను కార్పొరేటర్ల ఇంటి నుండే ప్రారంభించాలని సూచించారు. ప్రతి అక్షరాస్యుడు ఒక నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా చేయాలని కోరారు. ఈ సర్వేకై 150 వార్డులను 5704 లొకాలిటీలుగా విభజించినట్లు తెలిపారు. సర్వే నిర్వహించుటకు 8681 మంది ఎన్యుమరేటర్లు అవసరమని తెలిపారు. ప్రతి ఎన్యుమరేటర్ పది రోజులలో 250 నుండి 300 గృహాలను సర్వే చేస్తారని తెలిపారు.
ఈ సర్వేలో నిరక్షరాస్యుడి పేరు, తండ్రి/ భర్త పేరు, వయస్సు, ఫోన్ నెంబర్ మాత్రమే సేకరిస్తారని తెలిపారు. అలాగే హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆవాసంగా ఉన్నందున నిరక్షరాస్యుల మాతృభాషను కూడా నమోదు చేయనున్నట్లు తెలిపారు.
ఉదయం 7గంటల నుండి 11గంటల వరకు సర్వే జరుగుతుందని తెలిపారు. చదవడం, రాయడం రాని వారి వివరాలు సేకరించి అక్షరాస్యులైన కుటుంబ సభ్యులు, లేదా ఇంటిపక్కనున్న అక్షరాస్యులతో అక్షరాస్యులను చేసేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు.