నిషేధిత పొగాకు ఉత్పత్తులను మహారాష్ట్ర నుండి మందమర్రి కి రవాణా చేస్తున్న వ్యక్తిని మంచిర్యాల పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 18 సంచుల నిషేధిత పొగాకు ఉత్పత్తులు ( పుల్చాప్) స్వాధీన పరచుకున్నారు.
రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ ఏ.మహేందర్ ఉత్తర్వుల ప్రకారం, టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పిండి సురేష్ అనే వ్యక్తి, మహారాష్ట్ర నుండి మందమర్రి లోని తన ఇంటి కి రహస్యంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేసుకుంటున్నాడనే ముందస్తు సమాచారం పోలీసులకు అందింది.
దాంతో శనివారం ఉదయం అతని ఇంటి పరిసరాలలో టాస్క్ ఫోర్స్, మందమర్రి పోలీసులు మాటు వేసి ఉండగా, MH 30BD 3383 నెంబరు గల వాహనంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను తీసుకొచ్చి డ్రైవర్ హుస్సేన్ దింపుతూ కనిపించాడు. దాంతో పోలీసులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. ఈ క్రమంలో హుస్సేన్ పట్టుబడగా పిండి సురేష్ పరారీలో ఉన్నాడు.
పట్టుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల విలువ సుమారు 3,60,000/- గా ఉంటుంది. గత కొంత కాలంగా జన్నారం, లక్షటిపేట, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, మందమర్రి లలో వరుసగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని టాస్క్ ఫోర్స్ సిఐ మహేందర్ తెలిపారు.
ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్సై లచ్చన్న, మందమర్రి ఎస్సై భూమేష్, ట్రైనీ ఎస్సై రమేష్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్, రాకేష్ ,శ్రీనివాస్,శ్యామ్ సుందర్, సదానందం గౌడ్,వెంకటేష్, ఓంకార్,కిరణ్ లు పాల్గొన్నారు.