నేటి ఉదయం తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంఎల్ సి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసిపి కండువా కప్పుకున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉండి రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఓటింగ్ కు వచ్చిన సమయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైసిపికి అమ్ముడుపోయి రాజధాని అమరావతికి అన్యాయం చేశాడని అప్పటిలో డొక్కా మాణిక్యవరప్రసాద్ పై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. తాను రాజకీయాలను ప్రజా సేవ కోసం చేస్తానని, అలా డబ్బులు తీసుకుని పార్టీలు మారే పని చేయనని అప్పటిలో డొక్కా మాణిక్యవరప్రసాద్ వివరణ ఇచ్చారు.
అత్యంత కీలకమైన సమయంలో అమరావతి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన తన అసలు రూపాన్ని బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీని వీడి వైసిపిలో చేరారు.