ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) వివాదాలు పరిష్కారమవడంతో హైదరాబాద్ లోని ఉమ్మడి ఏపీ ఒలింపిక్ సంఘం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఏపీఓఏ ప్రధాన కార్యదర్శి ఆర్కే పురుషోత్తం తెలిపారు. ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఒలింపిక్ భవన్లో ఏపీఓఏకు హక్కు ఉందని వెల్లడించారు. కొంతకాలంగా కొందరు పనిగట్టుకుని సృష్టిస్తున్న వివాదాల కారణంగా ఇన్నాళ్లు ఏపీఓఏ ఆస్తులను స్వాధీనం చేసుకోలేకపోయామని చెప్పారు.
ఐఓఏ 2017లో ఏర్పాటు చేసిన ఆర్బిటేషన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన ఉన్న తమ సంఘానికి గుర్తింపునిస్తూ ఈనెల 15న తుది తీర్పును వెలువరించిందని తెలిపారు. ఈ తీర్పును గౌరవిస్తూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తమ అధికారిక వెబ్సైట్లో అధ్యక్షుడిగా కృష్ణదాస్, కార్యదర్శిగా తన పేరును పొందు పర్చాయని చెప్పారు. ఆర్బిటేషన్ తీర్పును సవాల్ చేయాలనుకుంటే స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్లో కౌంటర్ చేయాలని జస్టిస్ బిసి కందాపాల్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ తమ ఉత్తర్వుల్లో పేర్కొందని ఆయన వివరించారు. త్వరలో జరగబోయే ఐఓఏ ఎన్నికల్లో కూడా ఓటర్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీఓఏ ప్రతినిధులే పాల్గొంటారని పురుషోత్తం స్పష్టం చేశారు.
ఒలింపిక్ భవన్ నిర్మాణాన్ని పూర్తిగా ఏపీఓఏ నిధులతో చేపట్టారని, ఇందులో ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలకు భాగం ఉంది కనుక ఏపీకి 52 శాతం, తెలంగాణకు 48 శాతం వాటా ఉందని చెప్పారు. అలానే వివిధ బ్యాంకుల్లోని ఫిక్సెడ్ డిపాజిట్లు, ఒలింపిక్ భవన్ లోని కొంత భాగాన్ని అద్దెకు తీసుకున్న జీఎస్టీ విభాగం వారు 2015 నుంచి చెల్లించాల్సిన కిరాయి మొత్తం కలిసి దాదాపు రూ.1.30 కోట్లు ఏపీఓఏ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) మధ్య పంపకాలు జరగాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసులను టీఓఏ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్కు అందించామని, త్వరలోనే వారితో భేటీ అవుతామని చెప్పారు. చట్టబద్ధంగా ఏపీఓఏకు రావాల్సినవి ఎవరైనా అడ్డుకుంటే న్యాయపోరాటం చేస్తామని పురుషోత్తం హెచ్చరించారు.