అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల నుంచి తరిమికొట్టాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఉండే పవిత్రమైన స్పీకర్ పదవిలో ఉండి తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గతంలో రాజధానుల విషయంలో ఏపీ ప్రజలు నష్టపోయారని.. ఇకపై అలాంటి తప్పులు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్నిగుండం కాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడానికే సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు ఉండాలని నిర్ణయించారని అన్నారు. ఈ విషయంలో ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని అన్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలంతా రోడ్ల మీదకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సకల సౌకర్యాలు, అన్ని వసతులు ఉన్న విశాఖను రాజధాని చేయడంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.
కేవలం మధ్యలో ఉందనే కారణం చెప్పి అమరావతిని రాజధానిగా నిర్ణయించడం సరికాదని అన్నారు. గతంలో రాజధానుల విషయంలో ఏపీ ప్రజలు నష్టపోయారని.. ఇకపై అలాంటి తప్పులు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని స్పీకర్ అన్నారు.