పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక వైఎస్సార్సీపీ నాయకుల పై సత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావుకు మతిలేదని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నారని ఆయన అన్నారు. గురజాల నియోజకవర్గంలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలను వైఎస్ఆర్సిపి పార్టీ గానీ తాను గానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు.
గతంలో ఎన్నో అక్రమాలు చేసింది యరపతినేని శ్రీనివాసరావు కాదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కంటే ఎక్కువ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ లీజులు ఎక్కువ మంజూరు చేయించామని ఆయన తెలిపారు. ఈరోజు రేగుల గడ్డకు వెళ్లి అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఈ తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఏదో జరిగిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారు.
యరపతినేని ఆరోపిస్తున్న మైనింగ్ లీజు బాగోతం ఆయన హయాంలోని జరిగింది. మతిలేని మాటలు బుద్ధిలేని మాటలు మాట్లాడటం అసత్య ప్రచారం చేయడమే టిడిపి ఎజెండాగా మారింది. అక్రమాలకు ఈ ప్రభుత్వంలో తావులేదు అక్కడక్కడ యరపతినేని అనుచరులు గతంలో లాగా గంజాయి ,పేకాట ,గుట్కా ,మట్కా లాంటి వాటికి అలవాటు పడి మానలేక ఇప్పటికీ చేసుకుంటూ దొరికిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అని ఎమ్మెల్యే కాసు గుర్తు చేశారు.
ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు రమ్మని సవాల్ విసిరినా రాకుండా ఉన్నది తెలుగుదేశం నాయకులు యరపతినేని కాదా ? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని అక్రమాలపై చర్చించడానికి సిద్ధం… దాచేపల్లిలో పేకాట క్లబ్బు మొదలుకుని సీతారాంపురం మైన్స్ లో కొల్లగొట్టిన మైనింగ్ దాకా చర్చ జరగాల్సిందేనని కాసు అన్నారు. అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధం లెక్కలతో వస్తా! లెక్క తేల్చుకునే పోతా! అంటూ ఆయన సవాల్ విసిరారు.