గత ప్రభుత్వం ఏ మాత్రం కృషి చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండేవని ఆయన అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది నిండిన నేపథ్యంలో నిర్వహిస్తున్న మేధోమధనం సదస్సులో ‘మన పాలన-మీ సూచన’ అంశంపై ముఖ్యమంత్రి నాలుగో రోజు మాట్లాడారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, లేదంటే ఆ పార్టీకి మద్దతిచ్చే క్రమంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేసేవాళ్లమని చెప్పారు.
అయితే భవిష్యత్లో మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని, తాము అప్పుడు హోదా డిమాండ్ చేస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేసిందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తొలి ర్యాంక్ అంటూ గొప్పగా చెప్పుకుందని తెలిపారు.
పారిశ్రామిక రంగానికి భూములు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరతలేదన్నారు. మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం మెరుగ్గా ఉందని ఆయన అన్నారు.