కరోనా విజృంభిస్తున్న వేళ జర్నలిస్టు లకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక బీమా స్కీమ్ కల్పించాలని నిర్ణయించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులందరికీ బీమా కల్పించారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో పనిచేస్తోన్న ప్రింట్, ఎలక్ర్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ కలిపి మొత్తం 62 మందికి బీమా ప్రీమియం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెల్లించారు.
ఇన్సూరెన్స్ పత్రాలను ఆయా జర్నలిస్టులకు అందజేయనున్నారు. జూలై 15 నుంచి అమలులోకొచ్చిన జర్నలిస్టుల బీమాతో ఏదైన జరగకూడదని జరిగితే వారి కుటుంబాలకు ధీమా కల్పించేందుకు నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీమా పొందిన జర్నలిస్టుల్లో ఎవరైనా సహజ మరణం (కోవిడ్ వైరస్ వల్ల చనిపోయినా)అయితే నామినీకి 10 లక్షలు, ప్రమాదంలో ఎవరైనా జర్నలిస్టులు మృతి చెందితే వారి నామినీలకు 20 లక్షలకు బీమా వర్తించే పాలసీలను చేయించారు.
రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ప్రభుత్వం బీమా చేయించాలి
కోవిడ్-19 వైరస్ కల్లోలం రేపుతున్న వేళ..వైరస్ కట్టడికి ముందుండి పోరాడుతున్న వైద్య, పారిశుధ్య, అత్యవసర సర్వీసులు అందిస్తున్నవారందరూ కరోనా కాటుకు గురవుతున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా కట్టడికి కృషి చేస్తున్నవారితోపాటే జర్నలిస్టులూ విధులు నిర్వర్తిస్తున్నారని..అందుకే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న మంగళగిరి నియోజకవర్గం జర్నలిస్టులకు తాను భీమా చేయించానని లోకేష్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని, పిపిఈ కిట్లు అందజేయాలని, కోవిడ్ బారిన పడిన మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులు కూడా విధి నిర్వహణలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని, మీపై ఆధారపడిన కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరారు. శానిటజైర్ తమ వెంటే ఉంచుకోవాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వీలైనంత దూరం పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని కోరారు.
నాడు కార్యకర్తలకు…నేడు మీడియామిత్రులకు
తెలుగుదేశం పార్టీకి అన్నీ తామై నిలిచిన కార్యకర్తల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకునేందుకు కార్యకర్తల సంక్షేమ విభాగం నెలకొల్పి, దానిని విజయవంతంగా నిర్వహిస్తున్న దేశంలో ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం.వంద రూపాయల సభ్యత్వం చెల్లించిన టీడీపీ కార్యకర్తకు ప్రమాదభీమా, ప్రమాదంలో గాయపడినా చికిత్స ఖర్చులు చెల్లించేలా సంక్షేమ నిధి నుంచి అందరికీ పాలసీలు చేయించిన ఘనత సంక్షేమ విభాగం కన్వీనర్ నారా లోకేష్ దే.
దాదాపు 4529 మందికి,91 కోట్లు అందించి కార్యకర్తల కుటుంబాలకు ఆసరాగా నిలిచిందీ బీమా పథకం. కార్యకర్తల పిల్లల చదువులకు 2.50 కోట్లు,ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తల కుటుంబాలకు 15 కోట్లు అందించారు. నేడు మంగళగిరి నియోజకవర్గం జర్నలిస్టులకూ నారా లోకేశ్ బీమాతో ధీమా కల్పించారు.