కరోనా వైరస్ వ్యాప్తికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. కరోనా కేసులు పెరిగేందుకు టీడీపీ నేతలు కుట్రపన్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు.
సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎలాంటి కుట్రలకైనా పాల్పడతారని ఆయన అన్నారు. ఏ విధమైన ఇబ్బంది లేని గ్రామాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే… దీని వెనుక ఏదో కుట్ర కోణం ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలను, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతారని మంత్రి అన్నారు. అందుకే ఆయనపై అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి మోపిదేవి ఆరోపించారు. కరోనా వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నింటినీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
ఆయన ఆర్భాటమంతా ప్రచారం కోసమేనని ధ్వజమెత్తారు. ‘‘రాజధాని కోసం రైతులు, ప్రజల నుంచి జోలి పట్టి సేకరించిన నిధులు ఏమయ్యాయి? రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలను ఆదుకునేందుకు చంద్రబాబు ఎందుకు సహకరించటం లేదని మంత్రి అన్నారు.
రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ప్రమాణ స్వీకారం చేయబట్టే రాజ్భవన్లో వైరస్ సోకిందంటూ ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. కరోనా కిట్ల వ్యవహారంలో పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసిన ధరకే తమకూ సరఫరా చేయాలని ఆ కంపెనీకి ముందే స్పష్టం చేశామని, ఇప్పుడు దానిపై విచారణల అవసరమేముందని మోపిదేవి ప్రశ్నించారు.