రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నికల వేళ అన్ని పార్టీలు రైతు కోసం మాట్లాడతాయి.
కాని యాభై ఏళ్లయినా రైతుల పరిస్థితి మారలేదు. గత సీఎంలు వ్యవసాయం దండగ అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక కాలం అయినా కాకున్నా, కరెంటు ఉన్నా లేకున్నా రెండు పంటలు పండించే పరిస్థితి వచ్చింది.
కేసీఆర్ కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చారు అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం మీద 35 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.
దేశంలో ఇంత ఖర్చు చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన అన్నారు.
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదికను, షాపింగ్ కాంప్లెక్స్ ను, పఠాన్ చెరు టౌన్ లో గాంధీ థీమ్ పార్కు కు ఆయన శంకుస్థాపన చేశారు.
కోటీ అరవై లక్షల తో ఈ పార్కు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్పోరేషన్ ఎన్నికల్లో ఇచ్చిన హమీని నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశామని ఆయన తెలిపారు.