తెలంగాణ కాంగ్రెస్ కొత్త దూకుడును అలవాటు చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ తరువాత దాదాపు అధికార పార్టీపై దూకుడు మర్చిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త జవసత్వాలతో దూసుకుపోతోంది. అధికార టీఆర్ఎస్ పై గట్టిగా గొంతు పెంచిమరీ.. ఆ పార్టీ తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ ఎండగడుతోంది.
ఇప్పటివరకూ తమలోతామే కొట్టుకుంటూ.. విమర్శలు చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ లక్ష్యంగానే చేసుకుని భట్టి విక్రమార్క, మరికొందరు నాయకులు యుద్ధం చేస్తున్నారా? అన్నట్లుగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తమలోతామే కొట్టుకుంటూ.. తిట్టుకుంటుంటే.. బీజేపీ బలపడుతుందన్న నమ్మకమో.. లేక టీఆర్ఎస్ అధికారంలోకి మరోసారి వస్తుందన్న ఆలోచన ఏమోగానీ కాంగ్రెస్ మాత్రం ముందులాకాకుండా సమిష్టిగా ముందుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఈ బాధ్యతను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన భుజస్కందాలపై మోస్తున్నట్లుగా తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. వర్గ రాజకీయాలకు, గ్రూపు రాజకీయాలకు.. అంతర్గ ప్రజాస్వమ్యానికి అంతులేని స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ లో నాయకులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేలే భట్టి కార్యక్రమాలు రూపొందించడం పెద్దసవాలే.
ఈ నేపథ్యంలోనే నాయకత్వాన్ని ఏకం చేసేలా భట్టి విక్రమార్క ప్రజాసమస్యలపై పోరాటానికి, ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఆసుపత్రుల సందర్శన పేరుతో యాత్ర చేశారు. ఈ యాత్రలో భట్టికి నాయకులు కలిసివస్తారా? అన్న సందేహాలు ఇటు మీడియాలోనూ.. అటు ప్రజల్లో వ్యక్తమైనా.. యాత్ర సాగుతున్నకొద్దీ.. నాయకులు ఒక్కొక్కరుగా ఒక సమూహంలా భట్టితో చేరడం విశేషం.
భట్టి విక్రమార్క చేసిన ఈ యాత్రతో.. సరైన నాయకుడు ముందుకు వస్తే.. నాయకులు వర్గ విభేధాలు, గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి సమిష్టిగా కలిసి నడుస్తారన్న నమ్మకం ప్రజల్లోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ వచ్చింది. ఇన్నాళ్లు.. ఇలాంటి నాయకడెవరూ ముందుకు రాకపోవడం వల్లే సమిష్టి నాయకత్వం రాలేదన్న అభిప్రాయం శ్రేణుల్లో కనిపించింది.
మొత్తానికి మొత్తం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏకం చేయలేకపోయినా.. చాలావరకూ నాయకత్వాన్ని ఒక గొడుకు కిందకు భట్టి తీసుకువచ్చారన్న విశ్వాసం కార్యకర్తల్లో పెరిగింది.
ఇలానే ముందుకు వెళితే.. అధికారం హస్తగతం చేసుకోవడం పెద్ద విశేషమేమీ కాదన్న భావన యాత్రలో కార్యకర్తలు, శ్రేణులు వ్యక్తం చేయడం మరో విశేషం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమిష్టి మంత్రం.. కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊవు తెచ్చిందనేది వాస్తవం. కాంగ్రెస్ స్పీడ్ పెరిగాక.. బీజేపీ కాస్త సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది.
ఇదే స్పీడ్ కాంగ్రెస్ కొనసాగిస్తే.. తిరిగి బలం పుంజుకుని అధికారంలోకి ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో రాజకీయ వేడి చాలావేగంగా రాజుకుంది.. కాంగ్రెస్ దూకుడు రాజకీయాలు.. భట్టి విక్రమార్క సమిష్టి తత్వం కాంగ్రెస్ పార్టీకి ఏమేరకు లాభిస్తోందో వేచి చూడిల్సిందే.