పట్టణ,గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఊరికో ఆట స్థలం ఏర్పాటు చేస్తుందని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం తమ్మవరం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానం పనులకు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేసి,తమ్మవరం గ్రామంలో సిసి రోడ్లు,మెటల్ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రౌండ్లో రకరకాల క్రీడలకు కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.వీటిలో నీడనిచ్చే, ఆహ్లాదభరితంగా ఉండే మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.మొదట గ్రామాల్లో క్రీడా మైదానాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఒక్కో క్రీడా ప్రాంగణానికి ఎకరం నుంచి ఎకరంన్నర స్థలాన్ని నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.క్రీడా మైదానాలు పూర్తి ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
క్రీడల వలన శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రజలందరూ ఈ క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్