దాదాపు 80 రోజుల పాటు భక్తులకు దూరంగా ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు నేటి నుంచి దర్శనం ఇస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా స్వామి వారి దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. నేటి ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయం భక్తుల కోసం తెరచుకుంది.
ఈ ఉదయం ప్రయోగాత్మకంగా దర్శనాలను ప్రారంభించగా, ఏళ్ల తరబడి స్వామివారి సేవలో తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు స్వామిని దర్శించుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లను ధరించిన ఉద్యోగులు, క్యూ లైన్లలో ఆలయంలోకి వెళ్లారు.
దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ, స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలు, పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనాలు కల్పించేందుకు మార్కింగ్ లైన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ, నిలబడేందుకు ప్రత్యేక బాక్స్ లు, ఎక్కడికక్కడ శానిటైజర్లు అమర్చారు.