పదవ తరగతి పరీక్షల్లో నాగర్ కర్నూల్ జిల్లా నుండి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులకు ఉత్తమ పద్దతిలో శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సబిజెక్టు ఫోరమ్ ఉపాధ్యాయులను సూచించారు. గురువారం ఉదయం స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో సబిజెక్టు ఫోరమ్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ప్రతి విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై ఉపాధ్యాయులతో సలహాలు సూచనలు చేశారు. బాగా చదివే విద్యార్థి ఎలాగైనా పాస్ అవుతాడని కానీ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా చదువులో బాగా వెనకబడిన విద్యార్థి ఏ విధంగా పాస్ కావాలో ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడై ఉంటారని ఎవరిని తక్కువ అంచనా వేయలేమన్నారు.
చదువులో వెనుకబడిన విద్యార్థి సైతం ఒక సారి పదవ తరగతి పాస్ అయ్యాక వారి ఆత్మ విశ్వాసం పెరిగి విద్యాభివృద్ధిలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళను ఎంతోమందిని చూశామని ఉదహరించారు. విద్యార్థులలో చురుకైన వారని, మొద్దు విద్యార్థులని గ్రేడింగ్ చేయవద్దని అసలే కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడం వల్ల విద్యార్థులు కొంత ఆకాడమిక్ వెనుకబడ్డారని, ఎలాంటి పరీక్షలు సైతం గత రెండు సంవత్సరాలుగా రాయలేదన్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితిలో ఏ విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో అలాంటి సబ్జెక్టులో ఏ విధంగా బోధిస్తే విద్యార్థి సులువుగా పాస్ అవుతాడో అలాంటి పద్ధతిని అవలంభించాలన్నారు.
పరీక్షలకు కేవలం 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా మోడల్ ప్రశ్న పత్రం రూపొందించడం ముఖ్యమైన పాఠాలు, ముఖ్యమైన ప్రశ్నల జాబితా సిద్జం చేసి ఇవ్వడం లాంటివి చేయడమే కాకుండా విద్యార్థుల ను కొన్ని గ్రూపులుగా తయారు చేసి తోటి విద్యార్థి ద్వారానే ప్రశ్నలు సమాధానాలు చెప్పించడం లాంటివి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక పర్యవేక్షణ చేయడమే కాకుండా విద్యార్థులకు మనో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించాలని సూచించారు. ఉపాధ్యాయులు కనీసం 35 రోజులు కష్టపడితే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఎట్టి పరిస్థితిలో వెనుకబడ్డ విద్యార్థిని ఒంటరిగా కూర్చోపెట్టి చదివించవద్దని అలాచేయడం ద్వారా విద్యార్థి మానసికంగా ఓటమి చెందుతాడాని హెచ్చరించారు. ఈ విద్యా సంవత్సరం పదవతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి నాగర్ కర్నూల్ జిల్లాను ఆదర్శవంతగా తీర్చిదిద్దుదామని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టు ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరినీ ఘనంగా సన్మానం చేయడం జరుగుతుందని తెలియజేసారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజు, అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామినేషన్ రాజశేఖర్ రావు, కె.జి.బి.వి కోఆర్డినేటర్ చైతన్య, వందేమాతరం ఫౌండేషన్ అధ్యక్షులు మాధవరెడ్డి, సెక్టోరియల్ ఆఫీసర్ సతీష్ కుమార్, జిల్లా సైన్స్ ఆఫీసర్ కృష్ణ రెడ్డి, సబ్జెక్టు ఫోరమ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్