తెలంగాణలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. దీంతో ఇక ఫలితాల విడుదలపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తిచేసి మే 10న ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.
షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఏప్రిల్ 3న పదోతరగతి పరీక్షలు ప్రారంభించారు. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు ముగియగా. ఇక ఏప్రిల్ 11తో ఒకేషనల్ పరీక్షలు, ఏప్రిల్ 13తో ఓరియంటెల్ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈనేపథ్యంలో వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 21 వరకు మూల్యాంకనం చేపట్టి, ఆ తర్వాత టాబ్యులేషన్ నిర్వహించి మే 15న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.