విశాఖపట్నం రాజధానిగా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు ఎంతో ఆశగా ప్రకటించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం దుర్వార్త చెప్పింది. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేసేందుకు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకువచ్చి విస్త్రతంగా ప్రచారం చేసిన జగన్ ప్రభుత్వం ఇటీవల మాట మార్చి విశాఖపట్నమే రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అమరావతి రాజధానిపై రాష్ట్ర హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఆరు నెలలకు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన జగన్ ప్రభుత్వం ఈ లోపునే విశాఖ రాజధానిగా ప్రకటించేసింది. ఇందుకోసం భవనాలను కూడా వెతుకుతున్నట్లు వైసీపీ నాయకులు పలుదఫాలుగా చెప్పారు. ఏపీ రాజధానిగా అమరావతి రాష్ట్ర విజభన చట్టం ప్రకారమే ఏర్పాటైందని పార్లమెంటు సాక్షిగా కేంద్రం తేల్చి చెప్పింది.
అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015 లోనే నోటిఫై చేసిందని రాజ్యసభ లో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటు జరిగిందని కేంద్రం ప్రకటించింది.
రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని కేంద్రం చెప్పిందా? అన్న ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
దీనిపై మాట్లాడం సబ్ జ్యూడిస్ అవుతుందని కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లు తీసుకువచ్చే ముందు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు అని కూడా స్పష్టం అయింది.