ప్రజా రాజధాని అమరావతిని కోర్టు మెట్లు ఎక్కించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులతోనూ, కోర్టులతోనూ పూర్తి అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి రాజధాని రైతులను కూడా కోర్టుల పాలు చేశారని చెప్పారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని న్యాయవాదులకు ఖర్చు పెడుతూ,సుప్రీంకోర్టు వరకు రాజధాని లడాయిని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన అమరావతి, న్యాయస్థానంలోనూ అగ్నిపునీతంగా విజయం సాధిస్తుందన్న
ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి మూడు రాజధానులని, మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒకటే రాజధాని అని వ్యాఖ్యానించటం రాజధానిపై వారికున్న అనవగాహనకు, అమరావతి పై ఉన్న కక్షకు నిదర్శనంగా చెప్పారు. హైకోర్టు కావాలంటూ రాయలసీమలో బడి పిల్లలతో ర్యాలీ చేయటం దుర్మార్గం అని తెలిపారు. మూడు రాజధానులు బిల్లు లేకుండానే, రాజధానిని లగాయిగామార్చటం బాధాకరం అని పేర్కొన్నారు . ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే , అక్కడే రాజధాని అనుకున్నప్పుడు, ఇడుపులపాయలో కూర్చోవడం ఉత్తమమైన మార్గమని ముఖ్యమంత్రికి సూచించారు.
రాష్ట్రంలో పరిపాలనను పోలీసులకు అప్ప చెప్పి, అభివృద్ధిని ఎండబెట్టి, ప్రాంతాల మధ్య కలతలు రేపి చలి కాగుతున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే, పౌర సమాజం మేల్కోకపోతే ఆంధ్ర రాష్ట్రం మరో మూడు రాష్ట్రాల విభజన దిశగా అడుగులు వేసే ప్రమాదం లేకపోలేదని బాలకోటయ్య హెచ్చరించారు.