మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన ఆరోగ్య మహిళ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడమే ఆరోగ్య మహిళ కేంద్రాల లక్ష్యమని అన్నారు. మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో మహిళలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్దారణ జరిగిన వారికి తదుపరి చికిత్సను పూర్తి ఉచితంగా అందించేందుకు ఆరోగ్య మహిళా కేంద్రాలు దోహదపడతాయని ఆయన తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిందని, ఇందులో భాగంగా జిల్లాలో 6 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని కలెక్టర్ అన్నారు. ఇట్టి కేంద్రాలు ఖమ్మం రూరల్ మండలం ఎంవి పాలెం, వైరా, బోనకల్, కామేపల్లి, కల్లూరు మండలం చెన్నూరు లలో ఏర్పాటుచేసామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఆరోగ్య మహిళా కేంద్రం నిర్వహణ పట్ల విస్తృత ప్రచారం నిర్వహించి, మహిళలందరికీ వైద్య సేవలు అందే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు.
ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చిన మహిళలతో కలెక్టర్ ఇంట్రాక్ట్ అవుతూ, మహిళలకు ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో పరీక్షలను చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ప్రాథమిక డయాగ్నాస్టిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్ లు, పి.ఐ.డి., పిసిఓఎస్., కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, మెనోపాజ్ మేనేజ్మెంట్, లైంగిక వ్యాధులు, శరీర బరువు అంశాలు ఆరోగ్య కేంద్రంలో పరీక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళల్లో ఉన్న పోషకాహార లోపం నివారణ కోసం క్లినిక్ లో అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన అన్నారు. క్లినిక్ కు వచ్చే మహిళల వివరాలను ప్రత్యేక యాప్ లో పకడ్బందీగా నమోదు చేయాలని ఆయన తెలిపారు. అవసరమైన వైద్య చికిత్సల కోసం రిఫరల్ చేసిన కేసులను ఆశా కార్యకర్తల ద్వారా ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ సూచించారు. మహిళలు ఆరోగ్య మహిళా కేంద్రంలో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, వైద్యాధికారి డా. సంధ్యారాణి, రఘునాథపాలెం ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ నర్సింహారావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.