ముద్దు ఇవ్వాలని పదవ తరగతి విద్యార్థినిని వేధించిన ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
ఇన్స్పెక్టర్ మధు తెలిపిన వివరాల ప్రకారం బుద్వేల్ లోని రాకేష్ విద్యానికేతన్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని తనకు కిస్ పెట్టాలని ప్రిన్సిపల్ శంకర్ వేధించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక పాఠశాల నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్తుండగా క్లాస్మేట్ అయినా మరో విద్యార్థినికి జరిగిన విషయం తెలిపింది. ప్రిన్సిపల్ తనతో కూడా అదే విధంగా వ్యవహరించాడని బాలిక బాధితురాలితో వాపోయింది.
బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మైలర్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు ప్రిన్సిపల్ శంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మధు తెలియజేశారు.