స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 15వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఆంక్షల సమయంలో రాందేవ్గూడ నుంచి గోల్కొండ కోటకు వచ్చే రోడ్డు పూర్తిగా మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి అధికారులు ఇప్పటికే పాసులు జారీ చేశారు.
ఆ మార్గంలో ఏ గోల్డ్, ఏ పింక్, బీ బ్లూ పాసులు కలిగిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.సీ, డీ, ఈ పాసులు కలిగిన వారికి ఇతర మార్గాల నుంచి అనుమతి ఉంటుంది. పాసులు ఉండి సికింద్రాబాద్ నుంచి వచ్చేవారు బంజారాహిల్స్, మెహదీపట్నం, రేతిబౌలి, నాలానగర్, లంగర్ హౌస్ వంతెన, రాందేవ్గూడ మీదుగా గోల్కొండ చేరుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఈ బ్లాక్ పాస్ కలిగిన సాధారణ ప్రజలు హుడా పార్క్లో పార్కింగ్ చేసుకొని వేడుకలకు హాజరు కావాలని సూచించారు.