సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పండిత ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ పండిత సంఘాల జేఏసీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో బుధవారం నుండి 9, 10 తరగతులకు బోధన నిలిపివేశామని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (RUPP) నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధులు వేదార్థం మధుసూదన శర్మ, డా.గూడెలి శీనయ్య, కొల్లాపూర్, పెంట్లవెల్లి
మండలాల బాధ్యులు వేముల కోటయ్య, కే.వెంకటేశ్వర్లు, రాజేందర్ రెడ్డి, నారాయణ, విష్ణుమూర్తి, శ్రీదేవి, వరలక్ష్మి, మంజుల, కృష్ణ కుమారి తదితరులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై తమ వినతిపత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, పాఠశాల కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇచ్చామని వారు తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పండిత ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చాలని వారు కోరారు. కోర్టు కేసుల సాకుతో పండిత ఉపాధ్యాయులకు పదోన్నతులు నిలిపివేశారని, కానీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్సును తీసుకువచ్చి ఆ తర్వాత కోర్టు తీర్పుకు లోబడి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయని వారు తెలిపారు కాబట్టి, ఆ దిశగా చర్యలు తీసుకొని ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతుల ప్రక్రియలో పండిత ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.