షికారుకు వెళ్లి రాళ్ళ గుహలో చిక్కుకున్న రాజును బయటకు తేవడానికి జిల్లా యంత్రాంగం మొత్తం తలమునకలైంది. నిన్నటి మధ్యాహ్నం నుంచి మొదలుకుని సుమారు 15 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం నుంచి రాళ్ళ గుహలో చిక్కుకుపోయాడు. 24 గంటలు ఆలస్యంగా గ్రామస్తులకు విషయం తెలియడంతో నిన్న సాయంత్రం 3 గంటల నుంచి పోలీసులు, రెవిన్యూ, అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది గుహలో చిక్కుకున్న రాజును బయటకు తేవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రాత్రంతా రెస్క్యూ టీం సహాయక చర్యలు చేస్తూనే ఉన్నారు. 15 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ద్వారా పెద్ద పెద్ద బండరాళ్లను బ్లాస్ట్ చేయడంతో రాజు ఉన్న చోట కాస్త రంద్రం వెడల్పు కావడంతో రాజు కాళ్ళు బయటకు కనపడుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది రాజుకు నీళ్లు, ఇతర పానీయాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు అడ్డుగా ఉన్న బండరాళ్లను దాదాపుగా తొలగించారు. పోలీసులు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో దాదాపు రాజును బయటకు తేవడానికి మార్గం సుగమం అయినట్టుగా కనిపిస్తోంది. సుమారుగా గంట లోపలే రాజు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజు క్షేమంగా బయటకు రావాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకుని భగవంతుని కోరుకుంటున్నారు.
రాజు కుడి చెయ్యి రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడంతో దాదాపుగా ఆ చేయి పని చేస్తుందో లేదోనన్న అనుమానం వైద్యాధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాజుకు వైద్యం అందిస్తూనే ఉన్నారు. రాజుకు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు ధైర్యం చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు అతని కుమారున్నీ రాజుతో మాట్లాడించారు.
మరికొద్ది సేపట్లో రాజును క్షేమంగా బయటకు తేవడానికి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. 15 గంటలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ రెస్క్యూ ఆపరేషన్ అయితే అధికారులు చేపట్టారు. అధికారుల కష్టానికి ఫలితం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి