గల్ఫ్ బాధితుల మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సొంత గ్రామంలో ఉపాధి కరువై విదేశాల బాట పడుతున్నారు. కంపెనీ వీసాలపై వెళ్లి జీతం సరిగా ఇవ్వకపోవడంతో బయటకు వచ్చి దొంగచాటుగా పని చేసుకుంటున్నారు.
అలాంటి సమయంలో ప్రమాదాల బారిన పడి మృతి చెందితే స్వగ్రామానికి మృతదేహాలు రావడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా చివరి చూపుకోసం కుటుంబ సభ్యులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 20 సంవత్సరాలుగా గల్ఫ్ లోనే ఉన్నాడు. నలుగురు కూతుర్ల పెళ్లి చేసి అప్పులపాయ్యాడు.
బ్రతుకు భారంగా మారకముందే మళ్ళీ గల్ఫ్ వెళ్లి సంపాదించాలనుకుని దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. అప్పు తిరకముందే గుండె పోటుతో అనంతలోకాలకు వెళ్ళాడు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ గ్రామానికి చెందిన వడ్ల శంకరయ్య ఏడాదిన్నర క్రితం సౌదీ అరేబియా వెళ్ళాడు.
గతంలో 20 సంవత్సరాలుగా గల్ఫ్ లోనే ఉంటూ ఇంటికి వస్తూ పోతున్నాడు. పెళ్లికి ఎదిగిన కూతుళ్లు ఉండటంతో అప్పు భారం పెరిగింది. ఉన్న ఇంటిమీద 6 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నాడు. బయట 5 లక్షల అప్పు అయింది. అప్పు ఎలాగైనా తీర్చాలని ఏడాదిన్నర క్రితం మళ్ళీ సౌదీ వెళ్ళాడు. ముందుగా కంపెనీ వీసా మీద వెళ్లిన శంకరయ్య కంపెనీ నుంచి బయటకు వచ్చి పని చేసుకుంటున్నాడు. నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేని పరిస్తితిలోనే తమ తండ్రికి గుండెనొప్పి వచ్చి ఉండవచ్చని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, మృతదేహన్ని త్వరగా ఇంటికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.