దొంగతనానికి పాల్పడి తప్పించుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని చండూర్ సిఐ సురేష్ కుమార్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. చండూర్ సిఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 8.00 గంటల సమయంలో చండూర్ సర్కిల్ పరిధిలోని కనగల్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం వద్ద తనతో పాటు కనగల్ ఎస్.ఐ. సతీష్, కనగల్ క్రైమ్ పార్టీతో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఇతను దొరికాడు.
హోండా యాక్టివా వాహనంపై వస్తున్న ఒక వ్యక్తిని ఆపి, వాహన పత్రాలు అడగ్గా అనుమానాస్పదంగా ప్రవర్తించడం తో వెంటనే వాహనాన్ని తనిఖీ చేయగా బండి డిక్కీలో బంగారు ఆభరణాలు (15 గ్రాముల చైన్), రెండు గ్రాముల పుస్తెలు, 4.5 గ్రాముల బంగారు ముక్కతో పాటు 9,500 రూపాయల నగదు గుర్తించామని చెప్పారు.
అనుమానాస్పదంగా ఉన్న మెదక్ జిల్లా వెల్దుర్ది మండలం మాసాయిపేట కు చెందిన కుక్కదువ్వు స్వామిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను దర్వేశిపురంలో తాళం వేసి వున్న ఒక ఇంట్లో మార్చి నెలలో దొంగతనం చేసి అక్కడ దొరికిన డబ్బులు ఖర్చుపెట్టి, మిగిలినవి తనతో పాటు ఉంచుకున్నట్లు సిఐ వివరించారు.
కాగా అంతకు ముందు నకేరేకల్ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో బంగారు పుస్తెలు, హైదరాబాద్ లోని మేడ్చల్ , బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ దొంగతనాలకు పాల్పడినట్లు, దర్వేశిపురంలో హోండా యాక్టివా దొంగతనం చేసి మరో చోట దొంగతనం చేయాలని వెళ్తూ తమకు దొరికాడని సురేష్ కుమార్ వివరించారు.