రైతులు ఆందోళనకు గురవుతున్నట్టుగా భూములు ఎక్కడికి పోవని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ స్పష్టం చేశారు. జిల్లా కార్యాలయంలో కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ముసాయిదా రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని, ఫైనల్ కాలేదన్నారు. నవంబర్ 13 నుంచి జనవరి 11 వరకు అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రకటన ఇవ్వడం జరిగిందని, 11 చోట్ల మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
2000 సంవత్సరంలో కూడా ఇలాగే మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, అందులో ఇప్పటికి గజం భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని గుర్తు చేసారు. ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటికి 1026 అభ్యంతరాలు రైతుల నుంచి వచ్చాయన్నారు. ప్రజల అభ్యంతరాలు పరిశీలిస్తామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామనన్నారు. రైతులకు అవగాహన కల్పిస్థామన్నారు. రైతులు అధైర్య పడవద్దని, రైతుల భూములు లాక్కోవడం అనేది తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు.
రైతులను తప్పుదోవ పట్టించవద్దన్నారు. నిబంధనల ప్రకారమే జోన్లు చూపించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రియల్ జోన్ మార్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు బదులిస్తూ ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అవసరమైన చోట రోడ్లు కుదిస్తూ, అవసరం లేని చోట పెంచడంపై కలెక్టర్ భిన్నంగా స్పందించారు. 200 ఫీట్లు ఉన్న పాత జాతీయ రహదారిని 150 ఫీట్లకు మార్చడంపై ప్రజల నుంచి అభ్యంతరం వస్తే పరిశీలిస్తామన్నారు. లింగాపూర్ నుంచి 100 ఫీట్ల రోడ్డు అవసరమా అనే విషయంపై కలెక్టర్ స్పష్టత ఇవ్వలేదు.
ఇది డ్రాఫ్ట్ మాత్రమేనని, ఇంకా ఫైనల్ చేయలేదని ముందుగానే రైతులకు ఎందుకు చెప్పలేకపోయారని, ముందే చెప్పి ఉంటే రైతులు ఇంత ఆందోళనకు గురయ్యే వారు కాదు కదా అని, మంత్రి కేటీఆర్ స్పందించిన తర్వాతే స్పందించడానికి కారణమెంటని అడగ్గా కలెక్టర్ దాటవేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, రైతులకు సంబంధించి ఒక్క గుంట భూమి కూడా పోదని చెప్పారు.