ఢిల్లీ హైకోర్టు బార్ అసోషియేషన్ కార్యదర్శి అభిజాత్కు వచ్చిన బెదిరింపు కాల్పై దర్యాప్తు వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడాన్ని తప్పు పడుతూ ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించింది.
ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టు బార్ అసోషియేషన్ కార్యదర్శి అభిజాత్ వెల్లడించారు. దాంతో ఆయనను కొందరు ఫోన్ చేసి బెదిరించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని కాల్ లో బెదిరింపులకు పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది.
సదరు కాల్ కడప జిల్లా నుంచి వచ్చినట్టుగా చెబుతున్నారు. 08565 అనే ఎస్టీడీ కోడ్తో అభిజాత్కు కాల్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. బెదిరింపు కాల్ ఎవరు చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ కోడ్ జిల్లాలోని రాజంపేటకు చెందినది కావడంతో సీఎం ఇలాకాలో చర్చ మొదలైంది.
వైసీపీ శ్రేణుల్లో జగన్ అభిమానే రాజంపేట నుంచి బెదిరింపు కాల్ చేసినట్టుగా భావిస్తున్నారు. మరోవైపు దర్యాప్తు బృందం రాజంపేటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.