కడప నగరంలో గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన టిడ్కో ఇళ్ళను డిపాజిట్ చెల్లించిన లబ్ధిదారులకు కట్టిన ఇళ్లను 17 నెలల గా స్వాధీనం చేయ కుండా రాష్ట్ర ప్రభుత్వం అలక్ష్యం చేయడం తగదని ఈనెల 16వ తేదీన టిడ్కో ప్లాట్ లల్లో గృహప్రవేశoలకు సిద్ధం కావాలని లబ్ధిదారులకు సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
శుక్రవారం ఇళ్ల లబ్ధిదారుల సన్నాహక సమావేశం సిపిఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఈశ్వరయ్య మాట్లాడుతూ హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద ఏపీ టిడ్కో పర్యవేక్షణలో ప్రభుత్వ సబ్సిడీ , బ్యాంకు రుణంతో అపార్ట్మెంట్ ఫ్లాట్ కేటాయించేందుకు మూడు కేటగిరీలుగా లబ్ధిదారుల వాటా డబ్బును చెల్లించుకుని నాలుగేళ్లు గడుస్తున్నా పాలక ప్రభుత్వంలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
జిల్లావ్యాప్తంగా పూర్తయిన అపార్ట్మెంట్ల వద్ద విద్యుత్, డ్రైనేజీ ,రోడ్లు , నీటి సౌకర్యాలు వెంటనే కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ రివర్స్ టెండరింగ్ పుణ్యమా అని టిడ్కో ఇళ్ళు పేద మధ్యతరగతి ప్రజానీకానికి దక్కకుండా కాలయాపన చేస్తున్నారని వారు మండిపడ్డారు.
సొంత గూటి కోసం అప్పులు చేసి మరీ లబ్ధిదారుని వాటాగా డబ్బులు ప్రభుత్వానికి చెల్లించారని, అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి తప్పితే పేదలకు ఇప్పటివరకు ఇల్లు దక్కలేదని వారు ఆరోపించారు. నవరత్న పథకాలు అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సంకల్పించి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతున్నదని వారు విమర్శించారు.
సెంటు భూమి ఇంటి స్థలానికి ఏమాత్రం సౌకర్యవంతంగా ఉండదని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపేoదుకు సమాయత్తం కావాలన్నారు.
కడప నగర శివార్లలోని పేద ప్రజలు నివాసం ఉంటున్న కాలనీలన్నీ ఎర్రజెండా నీడన నిర్మితమైన వెనని పోరాటం చేయందే సమస్యలు పరిష్కారం కావని వారు పేర్కొన్నారు. సొంతింటి కోసం మన ఇంటి కోసం డిపాజిట్ డబ్బులు చెల్లించిన లబ్ధిదారులoదరూ ఈనెల 16వ తేదీన సోమవారం ఉదయం 9 గంటలకు కడప నగరంలోని సరోజినీ నగర్ వద్ద గల టిడ్కో ఇళ్ళ వద్దకు వచ్చి కేటాయించబడిన ప్లాట్/ఇంట్లో గృహప్రవేశం చేయాలని వారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.కృష్ణమూర్తి, యన్. విజయలక్ష్మి ,నగర కార్యవర్గ సభ్యులు, వేణుగోపాల్, జయరామయ్య , చెంచయ్య, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, వీరాంజనేయులు,నాగరాజు, ఖాలీలుల్లాఖాన్, పకీరప్ప, అబ్దుల్ సత్తార్, ఆచారమ్మ, ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.