కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట మండలం కొండపల్లి, దహెగాం మండలం దిగడలో పులుల దాడుల్లో మరణించిన నిర్మల, విఘ్నేష్ కుటుంబ సభ్యులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు.
ప్రభుత్వపరంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసానిచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మీ, పీసీసీఎఫ్ ఆర్. శోభ, కలెక్టర్ రాహుల్ రాజ్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు ఉన్నారు.
ఐటీడీఏ నుంచీ ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.25 వేలు, టీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్కొక్కరికీ రూ.20 వేల ఆర్థిక సహాయం అందచేశారు. వ్యక్తిగతంగా మంత్రి చెరో పది వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ కు ఆదేశం ఇచ్చారు. అదే విధంగా బాధిత కుటుంబాలకు అటవీ శాఖలో వాచర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.