అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యంతరహితుడు, కలియుగ దైవం మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణోత్సవం నేడు రాత్రి 11 గంటలకు ఆగమ పద్ధతిలో వేదమంత్రోచ్ఛారణల మధ్య వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా జరగనుంది. కళ్యాణ్ ఉత్సవ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు హాజరుకానున్నారు. కల్యాణోత్సవ వ్యాఖ్యాతలుగా తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్ట్ రిటైర్డ్ ఆఫీసర్ పండితులు అప్పనాచార్యులు, సదానంద శాస్త్రి వ్యవహరిస్తారు.
ఉదయం దేవాలయంలో పంచామృత అభిషేకం, బలిహరణం, గజవాహనం చే నిశ్చితార్థ సాంప్రదాయ ప్రకారంగా స్వామివారి కల్యాణమునకు ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కళ్యాణం అనంతరం గరుడ వాహనంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతాయని ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణం తిలకించాలని వారు కోరారు.