నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో శయన ఏకాదశి సందర్భంగా అన్ని దేవాలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. భక్తిశ్రద్ధలతో అర్చనలు పూజలు నిర్వహించారు.
శివాలయాల్లో స్వామివారికి పంచామృత అభిషేకాలు, జలాభిషేకం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొని భక్తుల సందడితో కోలాహలంగా దేవాలయాలు మారాయి. ఆషాడ మాసం, శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశి ని తొలి ఏకాదశి శయన ఏకాదశి అని పిలుస్తుంటారు.
ఈ ఏకాదశి దక్షిణాయన ప్రారంభంలో వైకుంఠ మూర్తి అయినా విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళతారని , అట్టి సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
ఈ తొలిఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని, రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో నిదురించ కుండా జాగారం చేసే సమయంలో విష్ణు పురాణం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం.